Analytics

Badilo Chadavani Bahu Granda Rachayita Raambhatla

బడిలో చదవని బహు గ్రంథ రచయిత
రాంభట్ల
దువు లేని వ్యక్తి కోట్లు గడించారంటే అశ్చర్యపోనక్కర లేదు. వందల ఎకరాల మాగాణికి యజమాని అంటే అసలే ఆలోచించ నక్కరలేదు. కానీ మూడో తరగతి మూడు చోట్ల మూడుసార్లు చదివిన వ్యక్తి, ఆ తర్వాత భాగ్య నగరం చేరుకొని ఆ మూడో తరగతి మళ్లీ చదివి, అలా అయిదో తరగతి వరకు మాత్రమే చదివి ఆపేసిన తర్వాత తాను లక్షలాది మందిని చైతన్యపరచే వ్యాసాలు, గ్రంథాలు రాశారంటే నమ్మలేం. కాశీ మజిలీ కథ అని అనుకోవచ్చు. లేదా కాళిదాసు నాలుక మీద కాళికాదేవి బీజాక్షరాలు రాసినట్లు ఈ కలికాలంలో అటువంటిదేమైనా జరిగిందని భ్రమ పడాల్సి ఉంటుంది. రాంభట్ల కృష్ణమూర్తి గురించి ఏమాత్రం తెలిసినవారైనా అది కథ అనుకోలేరు. నిజమని నమ్ముతారు. అపారమైన ఆయన విజ్ఞానానికి జోహార్లు సమర్పిస్తారు!
తూర్పు గోదావరి జిల్లా అనాతవరంలో 1920 మార్చి నెల 24న జన్మించిన రాంభట్ల మాట్లాడే విజ్ఞాన సర్వస్వంగా మిత్రులు, సన్నిహితుల ప్రశంసలందుకొన్నారు. కదిలే గ్రంథాలయంగా కీరి పొందారు. ''వినే ఓపిక ఉండాలే కానీ మనకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపగల సమర్థుడు. మంచి వక్త. తెలుగుదనంతో మాట్లాడగల తెలుగువాడు. ''శశ విశాణం'' గీతాల కవి. వివిధ సంస్కృతులూ, తాత్త్వికతల అధ్యయనం మీద ఆసక్తి గల వ్యక్తి. సమకాలీన తెలుగు జర్నలిజానికి సొగసులందించారు. కార్టూన్‌ను ఓ ఉద్యమంగా చేపట్టి ప్రజా చైతన్యానికి వినియోగించిన తొలి రాజకీయ కార్టూనిస్టు. ఈనాటి జర్నలిస్టుల్లో- కార్టూనిస్టుల్లో చాలా మంది రాంభట్లకు ప్రత్యక్ష- పరోక్ష శిష్యులనడంలో ఆశ్చర్యం లేదు.'' అంటారు ఆయన స్నేహితులు. 'తెలుగు గోష్ఠి'కి చెందిన సీనియర్‌- మల్లిక్‌ మాటల్లో చెప్పాలంటే- ''జీవితంలో ఆయనకి ఎవరూ ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి సన్మానాలూ చేయలేదు. చేస్తామన్నా ఆయన ఒప్పుకోలేదు. అందువల్ల ఇవి బిరుదులో కితాబులో కావు. ఆయన వల్ల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలకు లోనైన వారు ఆయనతో సంభాషణ అనే జ్ఞాన సంద్రాల్లో మునిగి ముత్యాలో, రత్నాలో ఏరుకున్నవారు వందలాది మంది రచయితలు. ముఖ్యంగా పత్రికా రచయితలు, చిత్రకారులు, మేధవులు ఎవరికి వారు తమ మనసుల్లో తామే అనుకున్న మాటలివి. ఆయనలోని విజ్ఞానం లోతుల్ని, అవగాహనలోని నిజాయితీ గాఢత్వాన్ని, ఆలోచనల ఎత్తునీ, సత్యాన్వేషణ దీక్షని స్వయంగా తెలుసుకున్నవారు అభిమాన గౌరవాలతో చెప్పిన మాటలివి'' అంటారు.
రాంభట్ల తాత ముత్తాతలది విశాఖపట్నం జిల్లా. ఆయన రెండో సంవత్సరంలో ఉండగానే తండ్రి చనిపోవడంతో ఓ చోట స్థిరంగా ఉండి విద్యనభ్యసించ లేకపోయారు. అనాతవరం, గజపతినగరం, ఇల్లెందుల్లో చదువుకొని, తిరిగి హైదరాబాదులో అయిదో క్లాసుతో చదువు మానేశారు. చిన్నతనంనుంచీ బొమ్మలు గీయడం నేర్చుకొన్నారు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు అన్నీ ఆయన సొంతంగానే అధ్యయనం చేశారు. గ్రంథాలయాలను నమ్ముకొన్నారు. అందువల్ల అవే ఆయన విశ్వవిద్యాలయాలయ్యాయి. ఆయనకి మంచి జ్ఞాపకశక్తి ఉండేది. అదే ఆయన వరం. అలాగే ఆయనకి గొప్ప తార్కికత, సులభమైన శైలి సహజ సిద్ధంగా అబ్బాయి. అందువల్ల ఏ అంశాన్నయినా పాఠకులు నమ్మేలా చెప్పగలరు. మీ పేరేమిటి అనే వ్యాసంలో రాంభట్ల... తన తార్కికతకి ఎంత బలమైన వాదన జోడించారో చూడండి- చరిత్రను పరిశీలించి చూస్తే శివుడు పాత దేవుడు. అతగానికి పూజలు కూడా విస్తారంగానే ఉన్నాయి. గుళ్ళూ గోపురాలు తక్కువే. ఆయన భక్తులు మాత్రం ఎక్కువ. ఆరాధకులు ఎక్కువ. ఆయన ఆకారం సింపుల్‌. అడిగిన వారికి అడిగినన్ని వరాలూ ఇస్తాడు. అడక్కపోయినా బూడిద ఇస్తాడు. విష్ణువు గొప్ప దేవుడు. ఆయన గుళ్ళూ గోపురాలూ గొప్పగా ఉంటాయి. అడిగిన వారందరికీ అడిగిన వరాలు ఓ పట్టాన కాని ఇవ్వడు. ఇచ్చినా అందులో ఎక్కడో ఓ చిన్న మెలిక ఉంటుంది. ఇప్పుడింక మనుషుల సంగతికొద్దాం. పేదా బిక్కీ అడుగూ బడుగు జనం అంతా శివభక్తులు. వాళ్లు కూడా శివుడు లాగే ఉంటారు. దిగంబరంగానో అర్ధ దిగంబరంగానో బతుకుతారు. కప్పుకొనడానికి బూడిద మాత్రమే వారి దగ్గరుంటుంది. వారిలో నోరున్నవారు అప్పోజిషన్‌గా తయారవుతారు. ఎంత అప్పోజిషన్‌ అయినా కళ్లముందు పవరు కనిపిస్తూ ఉంటుంది. కనక అడక్కపోయినా కోరిన వరాలన్నింటినీ కుమ్మరిస్తూ ఉంటారు. ఇక పవరులోకి వచ్చినవారూ, వారి నాశ్రయించుకుని ఉన్న కింకరులు, అందరూ విష్ణు భక్తులు. వాళ్ళు కూడా విష్ణువు లాగే పీతాంబరాలు, హారకేయూర ధారులు, శేష వస్త్రాలూ శాలువలూ కప్పుకొంటారు. వారి కన్ను పడిన చోట కనక వర్షాలు కురుస్తాయి. వారి పాదాలు సోకిన నేల పరశువేది అవుతుంది. వారంతా పవరులో ఉన్న పొలిటీషన్లు. విష్ణువులాగే ఒక పట్టానా వరాలివ్వరు. ఇచ్చినా అందులో లెక్క లేనన్ని మెలికలుండి తీరుతాయి... ఈ వ్యంగ్యం, సునిశిత హాస్యం, చమత్కారం, పురాణాలపై చరిత్ర పైన ఉన్న పట్టు, అవగాహన ఆయన్ని పత్రికల వైపు ఆకర్షించాయి.
రాంభట్ల కృష్ణమూర్తికి అడివి బాపిరాజుతో పరిచయం ఏర్పడింది. అది ఆయన్ని ''మీజాన్‌'' పత్రికలో ఉప సంపాదకుడిగా చేరేలా ప్రోత్సహించింది. అయితే ఆయన అందులోనే ఉండిపోలేదు. ఆనాటి విషయాల గురించి మల్లిక్‌- ''మనిషి, సమాజ చరిత్ర, కళ, సంస్కృతి, మతం, తాత్వికత- ఇవి ఆయన అభిమాన విషయాలు. ఆదిశంకరుని అద్వైతం తనను మార్క్సిస్టు తాత్వికతను సన్నిహితం చేసిందని ఆయన చెప్పిన మాట చాలా మందికి అర్థం కాలేదు. గోర్కీ లాగానే తనకూ ప్రపంచమూ సమాజమే విశ్వవిద్యాలాలైనాయని ఆయన చెప్పిన మాట చాలా మందికి అవగతం కాదు. చుట్టూ లోకాన్ని, జీవితాన్ని గమనిస్తూ అనుభవిస్తూ ఆయన అధ్యయనం చేశారు. ఆనాటి గొప్ప గ్రంథాలయాలు, ఎందరో మహనీయుల ప్రత్యక్ష పరిచయాలు, ఏక సంథా గ్రాహ్యత ఆయనకు తోడ్పడ్డాయి. జీవిక కోసం శరీర కష్టంతో శ్రమతో కూడిన అనేక పనులు చేశారాయన, ఫౌండరీలలో పని చేశారు. తన పాతికేళ్లప్పుడు 'మీజాన్‌'లో పాత్రికేయుడిగా అడుగు పెట్టిన నాటి నుంచి పత్రికా రచయితగా పెద్ద పెద్ద అంగలతో ముందుకు సాగుతూ పరిణతి చెందారు... 'మీజాన్‌' పత్రిక నుంచి ఆయన ఎందుకు వెళ్ళి పోవలసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ''నిజాం నవాబుని ఉరి తీయాలి'' అని తాను రాసిన సంపాదకీయమే ఆయన నిష్క్రమణకు కారణమైంది. 1952లో ''విశాలాంధ్ర'' పత్రికలో చేరారు. తర్వాత కర్మాగారాలలో పని చేశారు. ఆ తర్వాత 'ఈనాడు' పత్రికలో చేరారు. రాజకీయాలకు - సామాజిక శాస్త్రాల అధ్యయనానికి జీవితాన్ని అంకితం చేశారు. అభ్యుదయ రచయిత సంఘం సారథుల్లో ప్రముఖులు రాంభట్ల. ప్రతి అంశాన్నీ మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేయడం, అన్వయించడం ఆయనకు చాలా సహజంగానే అబ్బింది. ''ఇస్కస్‌'' అనుబంధంతో రష్యా వెళ్లారు. అలాగే అమెరికా, శ్రీలంకలు కూడా సందర్శించారు. ఈనాడులో పదవీ విరమణ చేశాక వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. 'ఉదయం' పత్రికలో కొన్నాళ్ళు రాశారు. ఆయన కావ్యాల్లో తొలిది- ''శశవిశాణం'' కవితల సంపుటి ప్రచురించారు. ''తెలుగు మఋగులు''ను 1986లో ప్రచురించారు. 'తెలుగు పుట్టు పూర్వోత్తరాలు' అనే పెద్ద వ్యాసం ఇందులో ఉంది. సుమేరు, అసీరియా సంస్కృతికి, తెలుగు సంస్కృతికి బాంధవ్యాలను ఆయన అందులో చర్చించారు. 1992లో దాన్ని విస్తృతం చేసి ''తెలుగుదేశంపై సుమేరు సంస్కృతి ప్రభావము'' పేరుతో ప్రచురించారు. అదే సంవత్సరం 'పారుటాకులు' అనే వ్యాస సంకలనం అచ్చయింది. 1997లో 'జనకథ', 1998లో 'వేదభూమి', 2001 మార్చిలో 'సొంతకథ', అదే సంవత్సరం ఆగస్టులో ''వేల్పుల కథ'' ప్రచురితమయ్యాయి. ఆయనకు ''తెలుగు గోష్ఠి'' సంస్థతో చివరి పద్దెనిమిది సంవత్సరాలలో అనుబంధం ఏర్పడింది. ఆయన ఆలోచనలు అసాధారణమైనవి. మేధావులు తప్పక ఆలోచించి, పరిశోధించాల్సిన సారభూతమైన ఆలోచనలు. అందుకే ఆయన్ని ఒరిజినల్‌ థింకర్‌ అనేవారు. మేధావులు, సంస్కృతిపై పరిశోధిస్తున్నవారు ఆలోచించేందుకు అనేక సమస్యలను, ప్రశ్నలను ఆయన ఆ తరం ముందుంచారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, పుస్తకాల రూపంలో వచ్చినవి చాలా స్వల్పమని ఆయన మిత్రులంటారు. రాంభట్ల కృష్ణమూర్తి 2001 డిసెంబరు ఏడో తేదీ కన్ను మూశారు. తెలుగు జాతి, భాష, సంస్కృతి మూలాల కోసం ఆయన సాగించిన అన్వేషణని ఎవరో ఒకరు కొనసాగిస్తారన్న నమ్మకం ఆయనకూ ఉండేది... మనకూ ఉండాలి!

1 comment:

  1. విక్రంగారు, సాహితీ సంపద పేరు పెట్టారు. మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహా బాగా ఉంది. కానీ ఈ టెంప్లేటు, ఈ ఫాంట్స్...ఇవి ఏం బాగోలేదండి..అసలు చదవడానికీక, ఒక్క అక్షరం కూడా కనిపించడానికి వీల్లేకుండా డిజైన్ చేసారు. ముందు మీరు వీలయినంత వెంటనే ఈ టెంప్లేటు మార్చేయండి. లేకపోతే మీరు చెప్పే మంచి విషయాలన్నీ మేం మిస్సయిపోతాం.

    ReplyDelete