Analytics

Vijnaanakhani Cheemakurti

విజ్ఞానఖని చీమకుర్తి
విజ్ఞాన సర్వస్వాలు చూసే అలవాటున్న వారికి ఒక పేరు తరచూ కనిపిస్తుంటుంది. తెలుగుభాష, సంస్కృతి, చరిత్రలకు సంబంధించి మనం ఏంమరచిపోయామో, మనకెంత తెలుసో అన్న ప్రస్తావన వచ్చినప్పుడు సైతం విద్వాంసులు ఆయన పుస్తకం చూడమంటారు. అంతేనా? తెలుగుభాషకి పాళీభాషకి ఏదైనా సంబంధం ఉందా? తెలుగులో పాళీపదసంపద ఎంత? తెలుసుకోవాలన్న ఆయన రచనలు పరిశీలించక తప్పదు. తెలుగు భాషకు, సాహిత్యానికి విశేషమైన సేవచేసిన ఆయనే చీమకుర్తి శేషగిరిరావు. ఇతరులను నొప్పించని ప్రవర్తన, అరుదైన ధైర్యసాహసాలు వ్యక్తంచేసిన గాంధేయవాది చీమకుర్తి. వేదోపనిషత్తులతో పాటు, శాస్త్రపరిజ్ఞానం, చరిత్ర, రాజనీతి, లలితకళలు, భాషా శాస్త్రాలపట్ల అవగాహన అన్నీ ఆయన్ని అసమాన మేధావిగా మార్చాయనడంలో సందేహంలేదు.
చీమకుర్తి ఇంటిపేరు చిల్లర. ఆయన తల్లిదండ్రులు ఆదెమ్మ, ఆదినారాయణలు. 1913 జూన్‌ 14న గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా వెల్లటూరులో జన్మించారు. వీరి ప్రాథమిక విద్య చేబ్రోలు, మాధ్యమిక విద్య తెనాలిలో జరిగింది. గుంటూరు ఏ.సి. కళాశాలలో బి.ఎ. రెండో సంవత్సరం పూర్తిచేసి మహాత్మాగాంధీజీ పిలుపునందుకుని స్వాతంత్య్ర సంగ్రామంలో దుమికారు. ఆయనకి పదమూడేళ్ల వయసులో చీమకుర్తి వెంకటప్పయ్య, నర్సమ్మ దంపతులు ఆయన్ని దత్తత తీసుకోవడంతో అప్పట్నించీ ఇంటిపేరు మారింది. చీమకుర్తి గ్రామంలో రైతులకు చెందాల్సిన మాన్యం, మాన్యం భూముల్ని భూస్వాములు అనుభవిస్తుండడంతో శేషగిరిరావు ఆ రైతులకు నాయకత్వం వహించారు. అహింసామార్గంలో ఆ భూముల్ని రైతులకు ఇప్పించారు. అది ఆయన సాధించిన తొలి విజయం. అది ఆయనలో ఉత్సాహం నింపింది. అది జరిగింది ముప్పైలలో. ఆయన వయసు పట్టుమని పాతికేళ్లు కూడా లేని తరుణంలో. అప్పట్నించీ ఆయన గాంధీ మార్గంలో పయనించారు. ఖద్దరు ధరించడం, నూలు వడకడం వంటివి నిత్యకృత్యాలయ్యాయి. దాదాపు అదే సమయంలో ఉప్పుసత్యాగ్రహం కూడా రానే వచ్చింది. అప్పట్లో అఖిలభారత కాంగ్రెస్‌ అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆవిష్కరించిన విజయ ధ్వజం ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఆయన ఒంగోలు తాలూకా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి అయ్యారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అప్పట్లో కనుపర్తి గ్రామ సమీపంలోని ఉప్పుకొఠారు నుంచి ఉప్పు సంగ్రహించి తెల్లవారి పట్ల తన తిరుగుబాటు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులు వెంటపడడంతో అజ్ఞాత వాసంలోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రతివాద భయంకర వెంకటాచారి, అచ్యుత పట్వర్థన్‌, జయప్రకాశ్‌నారాయణ్‌ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. గుంటూరు, బొంబాయి వంటి ప్రాంతాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఒంగోలు చేరుకుని బాంబులు తయారుచేశారు. ఆ విషయం పసిగట్టిన పోలీసులు ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిన చీమకుర్తి గుంటూరు, నెల్లూరు, బాపట్ల మొదలైన ప్రాంతాల్లో చాలాకాలం మారువేషాలతో కాలం గడపవలసి వచ్చింది. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ప్రకాశం ప్రీమియర్‌గా పదవీస్వీకారం చేసిన తర్వాత చీమకుర్తి పైన వున్న వారెంటు రద్దయింది.
చీమకుర్తి సాహిత్య జీవితం ఆయన మద్రాసులో తెలుగు భాషాసమితిలో చేరడంతో మొదలైంది. అక్కడ గిడుగు సీతాపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి వారిని కలిశారు. వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. చిన్న చిన్న రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మద్రాసు నుంచి విడివడిన తర్వాత తెలుగు భాషా సమితి హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రధాన సంగ్రాహకుడిగా ఆయన వివిధ గ్రంథాలు ముద్రించారు. ''హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ఆంధ్రాస్‌'' అనే ఆంగ్ల సంపుటానికి తొలిసారిగా పనిచేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రూపొందిన ఆ గ్రంథం తర్వాత రెండో గ్రంథం ''విజ్ఞాన సర్వస్వం'', తర్వాత విశ్వసాహితి, లలితకళలు, చరిత్ర, రాజనీతి వంటి గ్రంథాలకు సంగ్రాహకుడిగా పనిచేశారు. విజ్ఞాన సర్వస్వంలో ఎన్నో వ్యాసాలు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన ''ప్రపంచ రాజసర్వస్వము'' సంపుటానికి కూడా సంపాదకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో 'తెలుగు గోష్ఠి' అనే సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షులై ఆ సంస్థ పక్షాన - ''తెలుగు మఱుగులు, ఫర్గాటెన్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ తెలుగు, తెలుగు మఱుగులు రెండో భాగం, తెలుగులో పాళీపదాలు, ఉత్పత్తి పిడుగు మొదలైన గ్రంథాలు ప్రచురించారు. ఒంగోలులో ప్రకాశం విగ్రహం ప్రతిష్ఠించిన సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికకి కూడా ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన పేదవిద్యార్థులకు విరివిగా సాయం చేయడమేకాక తన గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మాణానికి తన భూమిని ఉచితంగా అందచేయడం విశేషం. ఎనభైలలో ఆయన దేశంలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. బుద్ధుడిపై ఆయనకి ప్రత్యేక మమకారం. 1994 ఏప్రిల్‌లో నేపాల్‌ సందర్శించారు. తిరుగు ప్రయాణంలో రుషీకేశ్‌ చేరుకుని ఇంటికొస్తూ 1994 సెప్టెంబరు పదహారో తేదీ భోపాల్‌లో పరమపదించారు. చీమకుర్తి భాషాసేవ నిరుపమానం.

Aadhunika Taatvikudu B.S.Raamulu

ఆధునిక తాత్వికుడు బి.ఎస్‌.రాములు
వ్యక్తికి సమాజానికి సాహిత్యానికి పరస్పర సంబంధం ఉంటుంది. వ్యక్తి సమాజంలో భాగంగా జీవిస్తాడు. సమాజంలో భాగంగా రూపుదిద్దుకుంటాడు. సమాజం పరిణామ శీలమైనది. సమాజ క్రమాన్ని వ్యక్తులు, శక్తులు, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి సాధనాలు సామాజిక వైరుధ్యాలు, సామాజిక వైవిధ్యాలు, పరస్పర ఐక్యత, ఘర్షణ, సహజీవనం, పరిమాణాత్మక గుణాత్మక మార్పుల క్రమాలు నిర్దేశిస్తాయి... ఈ దృష్టితో చరిత్రను అధ్యయనం చేయడాన్ని చారిత్రక భౌతికవాదం అంటారని పుస్తకాల్లో చదువుతుంటాం. అయితే ఆ విధమైన అధ్యయనం చేసిన సామాజిక తత్వవేత్త బి.ఎస్‌.రాములు. ఆధునిక సమాజంలో సాహిత్యాన్ని, సమాజాన్ని రెంటినీ అంతే సీరియస్‌గా అధ్యయనం చేయడం రాములు ప్రత్యేకత. ఒక వకుళాభరణం, ఒక ఐలయ్య వంటి వారు అధ్యయనానికి, తాత్విక చింతన వ్యాప్తికి పరిమితమైతే రాములు ఇంకో అడుగు ముందుకేసి సృజనాత్మక సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో మానవ సంబంధాల పరిణామ శ్రీలతను తనదైన పద్ధతిలో నమోదుచేశారు. అందుకే సృజనాత్మక, సామాజిక తత్వవేత్తగా అందరి మన్ననలూ పొందగలిగారు.
ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథాన్ని ఎలా విశ్లేషించాలో తన రచనల ద్వారా నిరూపించే బి.ఎస్‌.రాములు 1949 ఆగస్టు ఇరవైమూడో తేదీ కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో జన్మించారు. బేతి లక్ష్మిరాజు, నారాయణ తల్లిదండ్రులు. తండ్రి బొంబాయి బట్టలమిల్లు కార్మికుడు. ఆరోయేటే తండ్రి మరణాన్ని చూసిన రాములుకి కళ్ళు చెమర్చడం అప్పట్నించే మొదలైంది. తల్లి బీడీలు చుడుతూ వచ్చే అణా పైసలతో కుటుంబ పోషణం చేస్తుంటే తన లేతహృదయం తీవ్రంగా స్పందించేది. పేదరికం అంటే ఏమిటో నిర్వచనాలు అక్కర్లేకుండానే... దుర్భర దారిద్య్రంలో తన తొలి అడుగులు వేసిన రాములు తెలంగాణలో వందల ఎకరాల భూస్వాముల అరాచకాలు కళ్ళముందు కదులుతుంటే భూమిలేని వేలాది నిరుపేదల ఆక్రందనలు చెవుల్లో మారుమోగేవి. రజాకార్ల గురించి చదివిన రాములు, మతపరమైన విశ్వాసాలతో చెలరేగిన ఆందోళనలను ప్రత్యక్షంగా చూశారు. సహజంగానే, సాంస్కృతిక అతివాద భావజాలానికి ఆకర్షితులై, సంస్కృతీకరణను (సాంస్క్రిటైజేషన్‌) విశ్వసించారు. అందుకే 1967 నుంచి 1972 వరకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ముఖ్యశిక్షక్‌గా పనిచేశారు. జగిత్యాల మార్కజీ పాఠశాల విద్య పూర్తిచేశారు. చందమామ, బాలమిత్ర వంటి పత్రికల్లో రచనలు విస్తృతంగా చదివారు. బాలసాహిత్యం నుంచి ప్రేరణ పొందిన రాములు 1963-64 ప్రాంతాల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నపుడే చిన్న చిన్న రచనలు చేశారు. పాఠశాల ప్రత్యేక సంచిక 'స్రవంతి'లో అవి అచ్చయినపుడు ఆయన ఆనందానికి అవధుల్లేవు! అయితే 1968లో 'బాలమిత్ర' జనవరి సంచికలో 'జగిత్యాల కథ' పేరుతో అచ్చయిన తన తొలిరచనను ఇప్పటికీ మరచిపోలేరు. బయటి ప్రపంచానికి తనని రచయితగా పరిచయం చేసిన రచన అది! ఇక అప్పట్నించీ రచయితగా ఆయన కలానికి తిరుగేలేదు!
బి.ఎస్‌.రాములు ఎదిగేకొద్దీ జీవితంలో లోతు పాతుల్ని, వివిధ వాదాల్ని అవగతం చేసుకొన్నారు. విప్లవవాదం, దళిత వాదం, స్త్రీ వాదం వంటి ఏ ఒక్కవాదమో కాక అన్ని వాదాల్ని అవగతం చేసుకొని అవి ప్రవచించే మానవాభ్యుదయ లక్ష్యాన్ని పట్టుకొన్నారు రాములు. 'గతం'లో కూరుకుపోక, వర్తమానంలో తేలిపోక నడుస్తున్న చరిత్రకు తన రచనల్ని దర్పణం చేశారు. సాహిత్య సమావేశాలు, సభలు, సదస్సులు నిర్వహిస్తూచైతన్యం కోసం కృషిచేశారు. నిరుపేద ప్రజల ఉద్ధరణకు పనికొచ్చే పనిచేయాలని సంకల్పించిన రాములు జిల్లాస్థాయిలో పౌరహక్కుల సంఘం, అంబేద్కర్‌ సంఘాలు, విప్లవ సంఘాలలో సభ్యత్వం పొంది ఆ దిశగా కృషి ప్రారంభించారు. 1980లో 'విరసం'లో సభ్యత్వం పొందారు. ఆ సంసవత్సరమే తన ఉద్యోగానికి సెలవుపెట్టారు. 1983లో పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అయ్యారు. 1984-88ల మధ్య రాడికల్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే ఆ కాలంలోనే ఆయన గద్దర్‌, వరవరరావు, సంజీవ్‌ తదితరులతో కలసి అఖిలభారత పర్యటనకు వెళ్లడమేకాక అజ్ఞాతవాసంలోకి వెళ్లవలసి వచ్చింది. ఎన్‌.వేణుగోపాల్‌ మాటల్లో చెప్పాలంటే- బి.ఎస్‌. - ''1980 దశకమంతా హనుమకొండలోనూ, హైదరాబాద్‌లోనూ, బెజవాడలోనూ, అజ్ఞాతంలోనూ, ముమ్మరమైన ప్రజాజీవిత ఆచరణలో చాలా సన్నిహితుడయ్యాడు. కథకుడిగా, విరసం సభ్యుడిగా, రాడికల్‌ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా 1985-89 నిర్బంధకాలంలో, ఆ నిర్బంధాన్ని ప్రచారం చేయడానికి దేశవ్యాప్తంగా తిరిగిన బృందం సభ్యుడిగా, అజ్ఞాత కార్యకర్తగా'' బి.ఎస్‌కి ఎన్నో అనుభవాలున్నాయి.
బి.ఎస్‌.రాములు 1990లో తిరిగి బహిరంగ జీవితంలోకి వచ్చారు. 1992లో ఆంధ్రప్రదేశ్‌ దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. దానికి వ్యవస్థాపక అధ్యక్షులయ్యారు. ''కథకుడిగా ఆయన తెలంగాణా ప్రజల దీనస్థితిని అక్షరీకరించారు. కాలువ మల్లయ్య రాములు కథల్ని మూడు భాగాలుగా వర్గీకరించారు.
* విప్లవ సాహిత్య అవగాహనలో భాగంగా 1990 దాకా రాసిన కథలు
* తాత్విక సైద్ధాంతిక గ్రంథాలు రాసిన గాఢతతో రాసిన దళిత, బహుజన స్త్రీవాద కథలు.
* సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, మానవ సంబంధాల కథలు.
రాములు 25కి పైగా కథలు రాశారు. ఆరు నవలలు, నూటయాభై సిద్ధాంత వ్యాసాలు, అన్నీ సాహిత్య వ్యాసాలు, పది తాత్విక గ్రంథాలు రాశారు. పాలు, చదువు, స్మృతి, మమతలూ- మానవ సంబంధాలు, వేపచెట్టు వంటి కథల సంపుటాలు, బతుకు పోరు వంటి నవలలు ఆయనకి బాగా పేరుతెచ్చాయి. జ్ఞానం పుట్టుక, బీసీలు ఏంచేయాలి, నెనెవరు గతి తర్క తత్వ దర్శన భూమిక, బహుజన తత్వం, ప్రేమంటే ఏమిటి?, భౌతిక వాద ప్రాపంచిక దృక్పథం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువజనులారా వంటి తాత్విక గ్రంథాలు, సమగ్ర సామాజిక కథ, కథలబడి - కథా సాహిత్య అలంకార శాస్త్రం వంటి రచనలు చేశారు. ఇంకా ఉద్యమకథలు, తెలంగాణా వ్యాసాలు, కన్యాశుల్కంను ఎలాచూడాలి, సాహిత్య చరిత్రను కొత్తచూపుతో ఎలా తిరగరాయాలి? సాహిత్య చరిత్రను కొత్త చూపుతో ఎలా తిరగరాయాలి? పాట పుట్టుక, దళిత సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలి, సాహిత్యంలో సమాజ అన్వేషణ వంటి గ్రంథాలెన్నో రాశారు. కత్తి పద్మారావు అన్నట్లు ''బి.ఎస్‌.రాములు గారొక తాత్విక విశ్వవిద్యాలయం''. అందుకే ఆయన ''సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం'' పేరుతో వివిధ అంశాలపై సదస్సులు, చర్చలు, కథాపురస్కారాలు ఏర్పాటుచేస్తున్నారు. విశాల సాహితీ పురస్కారాలను ఇప్పటివరకు ఓ ముప్ఫై మంది కథల సంపుటాలకు ప్రదానం చేయడం విశేషం. వీరికథలు పాలు, బడి, సహజాతాలును ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎం.ఎ తెలుగులో పాఠ్యాంశాలుగా నిర్ణయించింది. పాలు కథ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ విద్యార్థులకి పాఠ్యాంశంగా ఉంది. 'సదువు'కథ గ్రూప్‌-1 సర్వీసెస్‌ వారికి తెలుగు పరీక్షల్లో పాఠ్యాంశమైంది. బి.ఎస్‌.రాములు, కథకుడిగా హేతువాదిగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు అందుకొన్నారు. దాశరథి రంగాచార్య పురస్కారం, కొండాలక్ష్మణ్‌బాపూజీ ఫౌండేషన్‌ పురస్కారం, పాల్కురికి సోమన పురస్కారం వంటి వెన్నో పొందారు. సాహిత్యం అంటే బువ్వపెట్టేదనీ, భూమి దక్కించేదనీ, జులుం నెదిర్చే రక్తకణాలని కొత్త అర్థం ఇచ్చిన తాత్వికుడు బి.ఎస్‌.రాములు. ఆయనే ఒక విశ్వవిద్యాలయం!

Badilo Chadavani Bahu Granda Rachayita Raambhatla

బడిలో చదవని బహు గ్రంథ రచయిత
రాంభట్ల
దువు లేని వ్యక్తి కోట్లు గడించారంటే అశ్చర్యపోనక్కర లేదు. వందల ఎకరాల మాగాణికి యజమాని అంటే అసలే ఆలోచించ నక్కరలేదు. కానీ మూడో తరగతి మూడు చోట్ల మూడుసార్లు చదివిన వ్యక్తి, ఆ తర్వాత భాగ్య నగరం చేరుకొని ఆ మూడో తరగతి మళ్లీ చదివి, అలా అయిదో తరగతి వరకు మాత్రమే చదివి ఆపేసిన తర్వాత తాను లక్షలాది మందిని చైతన్యపరచే వ్యాసాలు, గ్రంథాలు రాశారంటే నమ్మలేం. కాశీ మజిలీ కథ అని అనుకోవచ్చు. లేదా కాళిదాసు నాలుక మీద కాళికాదేవి బీజాక్షరాలు రాసినట్లు ఈ కలికాలంలో అటువంటిదేమైనా జరిగిందని భ్రమ పడాల్సి ఉంటుంది. రాంభట్ల కృష్ణమూర్తి గురించి ఏమాత్రం తెలిసినవారైనా అది కథ అనుకోలేరు. నిజమని నమ్ముతారు. అపారమైన ఆయన విజ్ఞానానికి జోహార్లు సమర్పిస్తారు!
తూర్పు గోదావరి జిల్లా అనాతవరంలో 1920 మార్చి నెల 24న జన్మించిన రాంభట్ల మాట్లాడే విజ్ఞాన సర్వస్వంగా మిత్రులు, సన్నిహితుల ప్రశంసలందుకొన్నారు. కదిలే గ్రంథాలయంగా కీరి పొందారు. ''వినే ఓపిక ఉండాలే కానీ మనకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపగల సమర్థుడు. మంచి వక్త. తెలుగుదనంతో మాట్లాడగల తెలుగువాడు. ''శశ విశాణం'' గీతాల కవి. వివిధ సంస్కృతులూ, తాత్త్వికతల అధ్యయనం మీద ఆసక్తి గల వ్యక్తి. సమకాలీన తెలుగు జర్నలిజానికి సొగసులందించారు. కార్టూన్‌ను ఓ ఉద్యమంగా చేపట్టి ప్రజా చైతన్యానికి వినియోగించిన తొలి రాజకీయ కార్టూనిస్టు. ఈనాటి జర్నలిస్టుల్లో- కార్టూనిస్టుల్లో చాలా మంది రాంభట్లకు ప్రత్యక్ష- పరోక్ష శిష్యులనడంలో ఆశ్చర్యం లేదు.'' అంటారు ఆయన స్నేహితులు. 'తెలుగు గోష్ఠి'కి చెందిన సీనియర్‌- మల్లిక్‌ మాటల్లో చెప్పాలంటే- ''జీవితంలో ఆయనకి ఎవరూ ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి సన్మానాలూ చేయలేదు. చేస్తామన్నా ఆయన ఒప్పుకోలేదు. అందువల్ల ఇవి బిరుదులో కితాబులో కావు. ఆయన వల్ల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలకు లోనైన వారు ఆయనతో సంభాషణ అనే జ్ఞాన సంద్రాల్లో మునిగి ముత్యాలో, రత్నాలో ఏరుకున్నవారు వందలాది మంది రచయితలు. ముఖ్యంగా పత్రికా రచయితలు, చిత్రకారులు, మేధవులు ఎవరికి వారు తమ మనసుల్లో తామే అనుకున్న మాటలివి. ఆయనలోని విజ్ఞానం లోతుల్ని, అవగాహనలోని నిజాయితీ గాఢత్వాన్ని, ఆలోచనల ఎత్తునీ, సత్యాన్వేషణ దీక్షని స్వయంగా తెలుసుకున్నవారు అభిమాన గౌరవాలతో చెప్పిన మాటలివి'' అంటారు.
రాంభట్ల తాత ముత్తాతలది విశాఖపట్నం జిల్లా. ఆయన రెండో సంవత్సరంలో ఉండగానే తండ్రి చనిపోవడంతో ఓ చోట స్థిరంగా ఉండి విద్యనభ్యసించ లేకపోయారు. అనాతవరం, గజపతినగరం, ఇల్లెందుల్లో చదువుకొని, తిరిగి హైదరాబాదులో అయిదో క్లాసుతో చదువు మానేశారు. చిన్నతనంనుంచీ బొమ్మలు గీయడం నేర్చుకొన్నారు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు అన్నీ ఆయన సొంతంగానే అధ్యయనం చేశారు. గ్రంథాలయాలను నమ్ముకొన్నారు. అందువల్ల అవే ఆయన విశ్వవిద్యాలయాలయ్యాయి. ఆయనకి మంచి జ్ఞాపకశక్తి ఉండేది. అదే ఆయన వరం. అలాగే ఆయనకి గొప్ప తార్కికత, సులభమైన శైలి సహజ సిద్ధంగా అబ్బాయి. అందువల్ల ఏ అంశాన్నయినా పాఠకులు నమ్మేలా చెప్పగలరు. మీ పేరేమిటి అనే వ్యాసంలో రాంభట్ల... తన తార్కికతకి ఎంత బలమైన వాదన జోడించారో చూడండి- చరిత్రను పరిశీలించి చూస్తే శివుడు పాత దేవుడు. అతగానికి పూజలు కూడా విస్తారంగానే ఉన్నాయి. గుళ్ళూ గోపురాలు తక్కువే. ఆయన భక్తులు మాత్రం ఎక్కువ. ఆరాధకులు ఎక్కువ. ఆయన ఆకారం సింపుల్‌. అడిగిన వారికి అడిగినన్ని వరాలూ ఇస్తాడు. అడక్కపోయినా బూడిద ఇస్తాడు. విష్ణువు గొప్ప దేవుడు. ఆయన గుళ్ళూ గోపురాలూ గొప్పగా ఉంటాయి. అడిగిన వారందరికీ అడిగిన వరాలు ఓ పట్టాన కాని ఇవ్వడు. ఇచ్చినా అందులో ఎక్కడో ఓ చిన్న మెలిక ఉంటుంది. ఇప్పుడింక మనుషుల సంగతికొద్దాం. పేదా బిక్కీ అడుగూ బడుగు జనం అంతా శివభక్తులు. వాళ్లు కూడా శివుడు లాగే ఉంటారు. దిగంబరంగానో అర్ధ దిగంబరంగానో బతుకుతారు. కప్పుకొనడానికి బూడిద మాత్రమే వారి దగ్గరుంటుంది. వారిలో నోరున్నవారు అప్పోజిషన్‌గా తయారవుతారు. ఎంత అప్పోజిషన్‌ అయినా కళ్లముందు పవరు కనిపిస్తూ ఉంటుంది. కనక అడక్కపోయినా కోరిన వరాలన్నింటినీ కుమ్మరిస్తూ ఉంటారు. ఇక పవరులోకి వచ్చినవారూ, వారి నాశ్రయించుకుని ఉన్న కింకరులు, అందరూ విష్ణు భక్తులు. వాళ్ళు కూడా విష్ణువు లాగే పీతాంబరాలు, హారకేయూర ధారులు, శేష వస్త్రాలూ శాలువలూ కప్పుకొంటారు. వారి కన్ను పడిన చోట కనక వర్షాలు కురుస్తాయి. వారి పాదాలు సోకిన నేల పరశువేది అవుతుంది. వారంతా పవరులో ఉన్న పొలిటీషన్లు. విష్ణువులాగే ఒక పట్టానా వరాలివ్వరు. ఇచ్చినా అందులో లెక్క లేనన్ని మెలికలుండి తీరుతాయి... ఈ వ్యంగ్యం, సునిశిత హాస్యం, చమత్కారం, పురాణాలపై చరిత్ర పైన ఉన్న పట్టు, అవగాహన ఆయన్ని పత్రికల వైపు ఆకర్షించాయి.
రాంభట్ల కృష్ణమూర్తికి అడివి బాపిరాజుతో పరిచయం ఏర్పడింది. అది ఆయన్ని ''మీజాన్‌'' పత్రికలో ఉప సంపాదకుడిగా చేరేలా ప్రోత్సహించింది. అయితే ఆయన అందులోనే ఉండిపోలేదు. ఆనాటి విషయాల గురించి మల్లిక్‌- ''మనిషి, సమాజ చరిత్ర, కళ, సంస్కృతి, మతం, తాత్వికత- ఇవి ఆయన అభిమాన విషయాలు. ఆదిశంకరుని అద్వైతం తనను మార్క్సిస్టు తాత్వికతను సన్నిహితం చేసిందని ఆయన చెప్పిన మాట చాలా మందికి అర్థం కాలేదు. గోర్కీ లాగానే తనకూ ప్రపంచమూ సమాజమే విశ్వవిద్యాలాలైనాయని ఆయన చెప్పిన మాట చాలా మందికి అవగతం కాదు. చుట్టూ లోకాన్ని, జీవితాన్ని గమనిస్తూ అనుభవిస్తూ ఆయన అధ్యయనం చేశారు. ఆనాటి గొప్ప గ్రంథాలయాలు, ఎందరో మహనీయుల ప్రత్యక్ష పరిచయాలు, ఏక సంథా గ్రాహ్యత ఆయనకు తోడ్పడ్డాయి. జీవిక కోసం శరీర కష్టంతో శ్రమతో కూడిన అనేక పనులు చేశారాయన, ఫౌండరీలలో పని చేశారు. తన పాతికేళ్లప్పుడు 'మీజాన్‌'లో పాత్రికేయుడిగా అడుగు పెట్టిన నాటి నుంచి పత్రికా రచయితగా పెద్ద పెద్ద అంగలతో ముందుకు సాగుతూ పరిణతి చెందారు... 'మీజాన్‌' పత్రిక నుంచి ఆయన ఎందుకు వెళ్ళి పోవలసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ''నిజాం నవాబుని ఉరి తీయాలి'' అని తాను రాసిన సంపాదకీయమే ఆయన నిష్క్రమణకు కారణమైంది. 1952లో ''విశాలాంధ్ర'' పత్రికలో చేరారు. తర్వాత కర్మాగారాలలో పని చేశారు. ఆ తర్వాత 'ఈనాడు' పత్రికలో చేరారు. రాజకీయాలకు - సామాజిక శాస్త్రాల అధ్యయనానికి జీవితాన్ని అంకితం చేశారు. అభ్యుదయ రచయిత సంఘం సారథుల్లో ప్రముఖులు రాంభట్ల. ప్రతి అంశాన్నీ మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేయడం, అన్వయించడం ఆయనకు చాలా సహజంగానే అబ్బింది. ''ఇస్కస్‌'' అనుబంధంతో రష్యా వెళ్లారు. అలాగే అమెరికా, శ్రీలంకలు కూడా సందర్శించారు. ఈనాడులో పదవీ విరమణ చేశాక వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. 'ఉదయం' పత్రికలో కొన్నాళ్ళు రాశారు. ఆయన కావ్యాల్లో తొలిది- ''శశవిశాణం'' కవితల సంపుటి ప్రచురించారు. ''తెలుగు మఋగులు''ను 1986లో ప్రచురించారు. 'తెలుగు పుట్టు పూర్వోత్తరాలు' అనే పెద్ద వ్యాసం ఇందులో ఉంది. సుమేరు, అసీరియా సంస్కృతికి, తెలుగు సంస్కృతికి బాంధవ్యాలను ఆయన అందులో చర్చించారు. 1992లో దాన్ని విస్తృతం చేసి ''తెలుగుదేశంపై సుమేరు సంస్కృతి ప్రభావము'' పేరుతో ప్రచురించారు. అదే సంవత్సరం 'పారుటాకులు' అనే వ్యాస సంకలనం అచ్చయింది. 1997లో 'జనకథ', 1998లో 'వేదభూమి', 2001 మార్చిలో 'సొంతకథ', అదే సంవత్సరం ఆగస్టులో ''వేల్పుల కథ'' ప్రచురితమయ్యాయి. ఆయనకు ''తెలుగు గోష్ఠి'' సంస్థతో చివరి పద్దెనిమిది సంవత్సరాలలో అనుబంధం ఏర్పడింది. ఆయన ఆలోచనలు అసాధారణమైనవి. మేధావులు తప్పక ఆలోచించి, పరిశోధించాల్సిన సారభూతమైన ఆలోచనలు. అందుకే ఆయన్ని ఒరిజినల్‌ థింకర్‌ అనేవారు. మేధావులు, సంస్కృతిపై పరిశోధిస్తున్నవారు ఆలోచించేందుకు అనేక సమస్యలను, ప్రశ్నలను ఆయన ఆ తరం ముందుంచారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, పుస్తకాల రూపంలో వచ్చినవి చాలా స్వల్పమని ఆయన మిత్రులంటారు. రాంభట్ల కృష్ణమూర్తి 2001 డిసెంబరు ఏడో తేదీ కన్ను మూశారు. తెలుగు జాతి, భాష, సంస్కృతి మూలాల కోసం ఆయన సాగించిన అన్వేషణని ఎవరో ఒకరు కొనసాగిస్తారన్న నమ్మకం ఆయనకూ ఉండేది... మనకూ ఉండాలి!

Bhoomiputrinunchi Hrudayanetri Varaku Malathi Chandoor

భూమిపుత్రినుంచి హృదయనేత్రి వరకు... మాలతీ చందూర్‌
-చీకోలు సుందరయ్య
''మల్లాది రామకృష్ణశాస్త్రి గారు'' మాది కృష్ణాజిల్లా పెద్దపీట వెయ్యండి'' అని 'కృష్ణాతీరం'లో ఒకచోట అంటారు. మాది కూడా కృష్ణాజిల్లాయే. కృష్ణా జిల్లాలోని నూజివీడు. ఏలూరికీ, బెజవాడకీ మధ్య వున్న మా వూరికి- రైల్వే స్టేషన్‌ వున్నా, అది వూరుకి పదమూడు మైళ్ల దూరంలో వుంది. మాకు నూజివీడు స్టేషన్‌ కంటే-అరటిపళ్ళ గెలతోక ముందు వుంచుకుని నిల్చుని వున్న హనుమాన్‌ జంక్షన్‌తోనే ఎక్కువ పరిచయం. మా వూరు వెళ్ళాలంటే హనుమాన్‌ జంక్షన్‌ మీదుగానే వెళ్ళాలి. అప్పట్లో ఆగిరిపల్లి రోడ్డులేదు. మా నాన్నగారు జమీందార్ల దగ్గర పనిచేసేవారట. అదేదో కోటపాడో, వుయ్యూరో... నాకు సరిగ్గా తెలియదు. ఎస్టేటులో పనిచేసేవారుట వాళ్ళతో పాటు...!''
ఈ పంక్తులు ఎవరివో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది! యాభయ్యేళ్లుగా తెలుగు పాఠకులకు బాగా తెలిసిన శైలి అది! నిజమే... ఒక భూమి పుత్రి... ఒక హృదయనేత్రి... వెరసి అశేష పాఠకుల అభిమాన రచయిత్రి... మాలతీచందూర్‌!
మద్రాసు వెళ్లే తెలుగు పాఠకులు సందర్శించాలనుకొనే ఇళ్లల్లో వారిదొకటి. చాలా మందికి తెలియనిది ఆ నది నూజివీడులో పుట్టి మద్రాసు దిశగా ప్రవహించిందనీ! ''చందూర్‌గారూ, నేనూ ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, బంధువుల్లో కొందరు వ్యతిరేకత, మరికొందరు ఉదాసీనత చూపించారు. అప్పుడు మా అమ్మ ''నేను వున్నాను భయంలేదు'' అని ధైర్యం చెప్పి, ఆసరాగా నిలబడింది. తనని నిందించినా, నిశ్శబ్దంగా సహించింది. ఆనాడు అన్నవారే ఈనాడు చుట్టరికాలు తిరగేస్తున్నారు...'' ఇప్పుడు అర్థమై ఉంటుంది... ఆ నది మద్రాసువైపునకు ఎందుకు ప్రవహించిందో!! సుశీల పాట వింటే భానుమతిని తెరమీద చూస్తే... మన సొంత అక్కయ్యలా ఎలా ఫీలవుతామో... మాలతీచందూర్‌ పేరువిన్నా అలాగే ఫీలవుతాం.
హైదరాబాదు హోటల్‌ గదిలో మాలతీ చందూర్‌ చేతి బంగారు గాజులు పోగొట్టుకొన్నారని పత్రికల్లో చదివిన వారు చాలామంది తమ ఇంట్లో దొంగలు పడ్డారన్నంతగా బాధపడ్డారు! ఆమె హృదయనేత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందితే రచయితలు, రచయిత్రులు తామే పొందినంత సంతోషించారు! ఆమెని ప్రత్యక్షంగా అభిమానించేవారు ఆమెకు ఉత్తరాల ద్వారానో, సభలు, సమావేశాల్లో కలవడం ద్వారానో పరిచయమయ్యే ఉంటారు. పరోక్షంగా అభిమానించేవారు వేలాది మంది!
1930లో జన్మించిన మాలతి, ఆరుగురు సంతానంలో చిట్టచివరి సంతానంగా పెరిగారు. ఆమె పదోనెల్లోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా తల్లిపై పడింది. ఆమె తల్లి పుట్టింటికి పోకుండానే సంసారాన్ని లాక్కొచ్చారు. ''మీకు తండ్రి లేడు. తండ్రిలేని పిల్లలు అని నలుగురూ, జాలిపడి చులకన చేసే విధంగా వుండకూడదు'' అంటూ ఆమె తల్లి ఆ పిల్లలకు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం నూరిపోశారు. మాలతికి ''అమ్మ డిక్షనరీలో మాతృప్రేమకు పర్యాయపదం క్రమశిక్షణ''గానే అర్థమైంది. పరిస్థితుల ప్రభావం అటువంటిది. అందుకే కళాశాల మెట్లెక్కకుండా నూజివీడు, ఏలూరుల్లోని ఉన్నత పాఠశాల విద్యతో సరిపెట్టుకొన్నారు మాలతి. ''నేను కాలేజీలో చేరి ఏ బి.ఏనో చదివి వున్నట్లయితే టీచర్‌గానో, గుమాస్తాగానో బతికేదాన్ని. కాలేజీ చదువు దక్కలేదు గాబట్టే రచయిత్రినయ్యాను'' అనే మాలతి జీవితంలో ముఖ్యమైన మలుపు చందూర్‌ ప్రవేశంతో చోటు చేసుకొంది. ''చందూర్‌గారితో వివాహం జరిగి మద్రాసు (ఇప్పటి చెన్నై)లో స్థిరపడ్డాక మూడేళ్లపాటు ఎక్కడికీ వెళ్లకుండా సాహిత్యపఠనం చేశాను. మద్రాసు లిటరరీ సొసైటీయే నా యూనివర్సిటీ. అప్పుడే విశ్వసాహిత్యంతో పరిచయం కలిగింది. నా ఆలోచనలకు, భావాలకు పునాది పడింది. ఆ సమయంలోనే రేడియో ప్రసంగాలు చేసే అవకాశాలూ వచ్చాయి. క్రమంగా నేనెందుకు కథలు రాయకూడదన్న ఆలోచనా, పట్టుదలా కలిగాయి. ఆ విధంగా రూపుదిద్దుకున్నదే నా మొదటి కథ'' ఆ కథే 1950 ప్రాంతాల్లో ''ఆనందవాణి'' పత్రికలో అచ్చయిన ''రవ్వల దుద్దులు''. పధ్నాలుగేళ్ల వయసులో చలం, శ్రీశ్రీ, నండూరి, కొనకళ్ల వంటివారిని కలిసే అవకాశం వచ్చింది. ఆమె తెలుగు కవులు, కథకులు, రచయిత్రులతోపాటు ఆంగ్ల రచయితల్ని విస్తృతంగా చదివారు. టాల్‌స్టాయ్‌, జేన్‌ ఆస్టిన్‌, ఛార్లెస్‌ డికెన్స్‌, సోమర్‌సెట్‌ మామ్‌, పెరల్‌ ఎస్‌.బక్‌, టాగూర్‌... ఇలా తాను చదువుతోన్న ప్రతి రచయితలోనూ ఏదో ఓ ప్రత్యేకతని గుర్తించారు. దాన్ని అవగతం చేసుకొన్నారు. చిన్ననాడు తను చూసిన జీవితం తర్వాత తను అనుభవించినదీ ఆమెకు చక్కని పునాదులు వేస్తే, ఆ పునాదుల మీద తను అర్థం చేసుకొన్న జీవితాల్లోంచి పాత్రలు తీసుకొని వాటికి సాహిత్య గౌరవం కల్పించారు. అలా వచ్చినవే-ఎనిమిది కథా సంకలనాలు; చంపకం-చెదపురుగులు, కాంచన మృగం, వైశాఖి, మనసులోని మనసు, ఎన్నిమెట్లెక్కినా, సద్యోగం, భూమిపుత్రి, మధురస్మృతులు, ఆలోచించు, ఏమిటీ జీవితాలు, జయలక్ష్మి, కృష్ణవేణి, మేఘాల మేలి ముసుగు, కలలవెలుగు, బతకనేర్చిన జాణ, రాగరక్తిమ, హృదయనేత్రి, శిశిర వసంతం, శతాబ్ది సూరీడు వంటి ముప్పై నవలలు! స్త్రీలు, గృహజీవనం తదితరాలకు సంబంధించి వంటలు-పిండివంటలు, అందాలు - అలంకారాలు, ప్రశ్నలు-జవాబులు, జాబులు-జవాబులు, మహిళలకు మధురజీవనం మొదలైన మరో పదిహేను పుస్తకాలు! ఇవికాక ఎన్నో సాహితీ వ్యాసాలు, సాహిత్యేతర వ్యాసాలు! తమిళంలో ప్రసిద్ధ రచయితలు జయకాంతన్‌, కరుణానిధి, శివశంకరి, పార్థసారథి, పుదుమై పిత్తన్‌, సుజాత వంటి వారి రచనలను తెలుగులోకి అనువదించారు మాలతీచందూర్‌. ముప్పై ఏళ్లుగా ''పాతకెరటాలు'' పేరుతో ఆంగ్ల రచనల పరిచయం చేస్తున్నారు. 47 సంవత్సరాలుగా భారతీయ పత్రికారంగంలోనే రికార్డుగా నిలిచిపోయేది ఆమె విశిష్ట శీర్షికారచన! అది నిలిచిపోయేంత వరకు ఆంధ్రప్రభ వారపత్రిలో, ఆ తర్వాత 'స్వాతి' వారపత్రిలోనూ వస్తోన్న సంగతి పాఠకులకు తెలిసిందే.
పన్నెండు సంవత్సరాల పాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సెన్సార్‌లో సభ్యురాలుగా ఉన్న మాలతీ చందూర్‌, ఎంతోకాలంగా దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ (మద్రాసులో) స్థాపించిన ఆంధ్రమహిళా సభలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నారు. వినియోగదారుల ఫోరమ్‌ మేనేజింగ్‌ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. నిర్వాసిత మహిళలకు ఆశ్రయం కల్పించే ''ఆశ్రయ'' సంస్థ సలహా సంఘం సభ్యురాలిగా ఉన్నారు. ఆంధ్రమహిళా సభ ఆధ్వర్యంలో వర్కింగ్‌ గరల్స్‌ హాస్టల్‌కి ఛైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, మద్రాసులోనూ ఉన్న ప్రసిద్ధ అవార్డులన్నీ ఆమె పొందారు. 1987లో 'భూమిపుత్రి'కి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 'హృదయనేత్రి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కైవసం చేసుకొన్నారు. ఈ నవలకే కర్ణాటక నుంచి ''అతే మబ్బె'' అవార్డును, కోల్‌కతానుంచి 'భారతీయ భాషా పరిషత్‌' అవార్డును పొందారు! పద్మావతి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందిన మాలతీచందూర్‌ ఈ నాటి కథకులు, కథల గురించి-''ఇప్పుడొస్తోన్న తెలుగు కథల్లో అద్భుతమైన వైవిధ్యం కనిపిస్తోంది. కుటుంబ బంధాలనుంచి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ దాకా ప్రతీ విషయం కథావస్తువుగా ఒదిగిపోతోంది. రాజకీయం, ప్రాంతీయత, కులం, పారిశ్రామిక రంగం, మహిళల, దళితుల, అంతర్జాతీయ సమస్యల్లో ఏవీ రచయితల దృష్టిని దాటిపోవడం లేదు. ముఖ్యంగా ఈతరం కథకుల్లో కనిపిస్తున్న ఎవేర్‌నెస్‌, అభివ్యక్తిలో నిజాయితీ చూస్తే సంతోషంగా వుంది...'' ఈ అభిప్రాయంలో ఆమె హృదయం ఎంత విశాలమో తెలుపుతోంది. అంతేకాదు, తమ రచనలకో, తమ కాలం రచనల వద్దో ఆగిపోయే సీనియర్లకన్నా భిన్నంగా ఆలోచించే ఆమె మనస్తత్వం కూడా దీనిద్వారా తెలుస్తోంది. ''నేను సమాజాన్ని మార్చాలనీ, మార్చగలననీ అనుకొని రచనలు చేయలేదు'' అని ఆమె అనడం ఆమె ఔన్నత్యానికి, ఎంత ఎదిగినా ఒదిగి నిలిచే గుణానికీ నిదర్శనం. ఎంతోమంది ఆమె రచనలనుంచి స్ఫూర్తినీ, పరిష్కారాలను పొందారనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిబద్ధత, నిర్భయత్వం, సమాజంపట్ల ప్రేమ, జీవితం పట్ల ఆశావహ దృక్పథం... ఇవన్నీ కలిస్తేనే ఒక మాలతీ చందూర్‌...! ...ఆమె రచనలు!!

Kavitaa Vaitarani C.V.Krishnarao

కవితా వైతరణి సి.వి.కృష్ణారావు
- చీకోలు సుందరయ్య
''ఈ చిత్రమైన ప్రపంచంలో అనామకుడు చక్రవర్తి కావాలనుకుంటాడు. ఎవడూ చూడకుండా దర్బారు చౌకీదారు రాజుగారి సింహాసనం మీద కూర్చుని మీసాలు మెలేస్తాడు. ఈ మూఢుణ్ణి చీకటితప్ప ఎవరు చక్రవర్తిగా గుర్తించారు? అందుకే అసలు సింహాసనాన్నే విరగదన్నండి. తరతమ భేదాలు తెలియకుండా పోతుంది...'' ఈ మాటలనడానికి ఏ రచయితకైనా ఎంత అవగాహన, ధైర్యం కావాలి? అందరితో ఒకేసారి రోదించు
ఒకే స్వరంతో స్పందించు
ఆశకు ఆహ్వానం పలుకుతూ సామూహిక జీవనంలోనే కష్టమైనా, సుఖమైనా మానవ జీవితాన్ని సఫలీకృతం చేస్తుందనే ప్రాచీనతత్వాన్ని ఎంతో ఆధునికంగా వ్యక్తీకరించిన కవి ఈయన.
ఈ జగత్తు పరిధిలో/ ఈ చరిత్ర నడకలో
అనాది మానవుడు మాత్రమే/ సోదరుని కష్టం దొంగిలించలేదు
అప్పట్నించీ నేటివరకు/ సంఘంలో సహచర్యంగా
బ్రతకుట ఎవ్వరికీ తెలియలేదు...
నిజమేకదా... 'సహనాభవంతు''... వంటివన్నీ మననానికీ, చదవడానికీ తప్ప గమనానికి ఎప్పుడూ ఉపయోగించుకోవడం ఈ జాతి నేర్చుకొన్నదని ప్రశ్నించడం తెలిసిన అభ్యుదయకవి... సి.వి.కృష్ణారావు.


అభ్యుదయ కవిత్వోద్యమంలో జన్మించి, జీవిస్తోన్న కవి ఆయన.
'నెలనెలా వెన్నెల' పేరుతో ప్రతినెలా చివరి ఆదివారం సాహితీమిత్రుల్ని సమావేశపరిచి కవితల్ని, కవితోక్తుల్ని, ఆత్మీయతల్ని మరచిపోకుండా కాపాడుకొంటూ ముందుకు సాగుతున్న సమష్టి కవితా శక్తి సి.వి.కృష్ణారావు. 'తమ్ముడూ' అంటూ కొందర్ని, 'నాన్నా' అంటూ కొందర్ని, 'తమ్మీ' అంటూ కొందర్ని, 'అమ్మా' అంటూ మరికొందర్ని తన కరచాలనంతో సాదరంగా ఆహ్వానించి, భుజం తట్టి కవిత్వం నవనవోన్మేషంగా విలసిల్లడానికి తన సర్వశక్తుల్ని ఒడ్డుతున్న కవి, కార్యకర్త, సమాజసేవకుడు, నెలనెలా వెన్నెల సి.వి.కృష్ణారావు.
సుప్రసిద్ధ విమర్శకులు, రచయిత, సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్‌ ఓ చోట కృష్ణారావు గురించి రాస్తూ- ''కృష్ణారావు కవిత సార్వకాలికం. కుందుర్తి విడిచి వెళ్లిన అసలు సిసలు వచనకవితకు కృష్ణారావే చిరునామా అన్నా, అత్యుక్తి కాబోదు! కుందుర్తి ఒక మంచి ప్రయోగం గురించి ముచ్చటిస్తూ ఒకే కేంద్ర కథావస్తువుకు సంబంధించిన భావపరంపర- పరస్పరం పెనవేసుకున్న వివిధ ఖండికల రూపంలో ఉందన్నాడు. కృష్ణారావు 'వైతరిణి'లో తరతరాలుగా దగాపడిన అధో జగత్సహోదరుల దుర్భర జీవితాలకు కవితా రూపమిచ్చారు. చీకుచింతలతో కూడిన మురికి పేటలలోని వేలకొలది జనుల విషాదగాధను వినిపించాడు. ఇది ఏకాంతంగా, తీరుబడిగా లోతులు చూడడానికి ఉద్దేశించిన కవితావైతరణి కాదు... ''విధి తిరస్కరించిన వ్యథాభరిత జీవితాలవైపు పాఠకుల దృష్టిని మళ్లించిన వైతరణి! కృష్ణారావు ఆశలు, ఆకాంక్షలూ వైయక్తికాలు కావు, సామాజికం. కష్టజీవుల్ని కడతేర్చి దరిచేర్చగల ఆగామికి స్వాగతం చెప్పే కవి మనస్సు చిరంజీవం. వృత్తులను ప్రతీకలుగా చెప్పి ఈ అట్టడుగు జనాలు ఎవరో పాఠకుల మనస్సులను కదిలించాడే కవి!'' కృష్ణారావుకవిత్వ జీవితాన్ని కవిత్వ తత్వాన్ని ఆయన ఆవిష్కరించారనడంలో సందేహం లేదు.
సి.వి.కృష్ణారావు 1926 జులై మూడో తేదీ నల్గొండ జిల్లా రేవూరులో జన్మించారు. తల్లిదండ్రులు:
జగ్గయ్యపేట, గుంటూరు, హైదరాబాద్‌, బొంబాయిల్లో విద్యనభ్యసించిన సి.వి.కృష్ణారావు బి.కామ్‌డిగ్రీతోపాటు ట్రైబల్‌ వెల్ఫేర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు కూడా పూర్తిచేశారు. కొన్నాళ్లు బ్యాంకు గుమాస్తాగా పనిచేసి ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల్ని చైతన్యపరిచారు. తర్వాత సాంఘిక సంక్షేమశాఖలో వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగం సంచాలకులుగా కొన్నేళ్లు పనిచేసి, అందులోనే పదవీ విరమణ చేశారు. ఆదిలాబాదు నుంచి సాలూరు దాకా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోను దళితులు, ఆదివాసుల్లో విద్య, వ్యవసాయాభివృద్ధి, పశుగణాభివృద్ధి, కుల భేద నిర్మూలన కోసం ఎంతో శ్రమించారు. అందుకే ఆయన పదవీవిరమణ చేసినపుడు వందలాది దళితులు అంతమంచి అధికారి తమని వదలి వెళ్తున్నందుకు బాధనాపుకోలేకపోయారు. టెన్నిస్‌ వాలీ బృహత్తర ప్రణాళికా అధ్యక్షుడు, డెమొక్రసీ ఇన్‌ యాక్షన్‌ గ్రంథరచయిత డేవిడ్‌ లిలియాంతాల్‌ని ఆదర్శంగా తీసుకొని వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. లాండ్‌ కాలనైజేషన్‌ పథకాలు, సాగునీటి పథకాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు చేపట్టే పునరావాస కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా కృషిచేసి ప్రజల మన్ననలు పొందారు సి.వి.కృష్ణారావు. ఆయన తొలి కవితా సంకలనం ''వైతరణి''. తర్వాత ''మాదీ మీ వూరే'', ''అవిశ్రాంతం'' వచ్చాయి. లాటూరు కిల్లారి భూకంపానికి స్పందిస్తూ ''కిల్లారి'' అనే కవితల సంపుటి ప్రచురించారు. దీన్ని ఢిల్లీకి చెందిన డా. వి.వి.బి.రామారావు ఆంగ్లంలోకి అనువదించారు.

సి.వి.కృష్ణారావు దళిత నిబద్ధత కల దార్శనికుడని ఆయన్ని అత్యంత సమీపంనుంచి గమనించిన సుమనశ్రీ వంటి కవులు, విమర్శకులు పేర్కొనడం గమనార్హం. ఎ.బి.కె.ప్రసాద్‌ అన్నట్లు ''జాషువా 'నాల్గుపడగల హైందవ నాగరాజును' చూపగా, వైతరణి కవి 'పంచముడి ఉనికికి సరికొత్త అర్థాన్ని సంతరించి పెట్టారు. జంటనగరాల్లో కుందుర్తి తర్వాత మరో కుందుర్తిలా వచనకవితా వికాసానికి కృషిచేశారు. ఉబుసుపోకకు కవితలు రాయడం, రాయించడం కాక ప్రతినెలా ఏదో ఒక ప్రసంగమో, చర్చో, పుస్తకావిష్కరణమో జరుపుతూ, యువ కలాల పదును ఏమేరకో కవితాగానాలు నిర్వహించారు. కవితా సంకలనాలు ప్రచురించారు. ఒక కవిత మంచి కవిత ఎందుకైందో విశ్లేషకుల చేత వివరింపజేయడం గమనార్హం. నెలనెలా వెన్నెలను సుమనశ్రీ వంటివారు అవార్డు ప్రదానాలకు వేదిక చేసి యువకవుల్ని ఆకర్షించారు. వయసు భారం ఎంత మీదపడినా, మసాబ్‌ట్యాంక్‌ నుంచి ఆస్మాన్‌గఢ్‌కు మకాం మారినా కార్యక్రమాలకు, కవితాగానాలకు లోటు లేకుండా, లోపం రానీకుండా చేస్తూ సి.వి.కృష్ణారావు నెలనెలా వెన్నెల ఆగకుండా చేస్తున్నారు. సి.వి.కృష్ణారావు నిస్సందేహంగా దళిత నిబద్ధతగల దార్శకుడు! ఒక వైతరణి!!

Sevatatparudu Kalnal Raaju

 

సేవాతత్పరుడు కల్నల్‌ రాజు
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అనగానే ఇంకా ఈ దేశంలో కోట్లాది మందికి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన సహచరుడిగా, వైద్యుడిగా యుద్ధాల్లో అనేక సార్లు త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకొన్న ఓ కల్నల్‌ మన తెలుగు వాడైనందుకు గర్విస్తాం. ఆయన వట్టి కల్నల్‌ మాత్రమే కాదు. అనేక ఆసుపత్రులు, కళాశాలలు స్థాపించి తెలుగు వారికి వెలుగునీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించిన వ్యక్తి. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ నిర్మాణంలో పాల్గొన్న యోధుడిగా, ఆజాద్‌హింద్‌ ఫౌజ్‌ నాయకుడిగా పొందిన అనుభవాన్ని కేంద్రమంత్రిగా చేతల్లో చూపిన కార్యశీలుడు. ప్రకృతి ఆరాధకుడు. ఈ దేశం నాకే మిచ్చిందన్నది కాక ఈ దేశానికి నేనేమిచ్చానని ప్రశ్నించుకొని త్యాగయమ జీవితం గడిపిన కల్నల్‌ డాక్టర్‌ డి.ఎస్‌.రాజు జీవిత పయనం ఎలా సాగిందో చూద్దాం.
1904 ఆగస్టు 28న శృంగవృక్షంలో మాతామహుల ఇంట్లో జన్మించారు సత్యనారాయణరాజు. తల్లిదండ్రులు అచ్చయ్యమ్మ, రామచంద్రరాజులు. స్వగ్రామం పోడూరు. నరసాపురం తాలూకా. అప్పట్లో అది కృష్ణా జిల్లాలో ఉండేది.

1924 తర్వాత పశ్చిమగోదావరి జిల్లాకు మారింది. పెద్ద వ్యవసాయ కుటుంబం. తండ్రి ఆయర్వేద వైద్యులు. అక్షరాలు దిద్దే వయసులోనే తల్లి కన్నుమూసింది. అమ్మ లేకున్నా పిన్ని, పెద్దమ్మలు ఎంతో ఆప్యాయంగా చూశారు. ప్రాథమిక పాఠశాలలైనా లేని ఊళ్లల్లో ఎన్నో కష్టాలకోర్చి విద్యాభ్యాసం ప్రారంభించారు. వీరవాసరంలో మాధ్యమిక పాఠశాల విద్య పూర్తిచేశాక నర్సాపురం టైలర్‌ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 

1923లో మద్రాసులో ఇంటర్‌ మొదటి తరగతిలో పాసయ్యారు. రాజు డాక్టరు కావాలని తండ్రి కోర్కె. అదే సంవత్సరం విశాఖలో వైద్య కళాశాల ప్రారంభమైంది. మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా రాజు అందులో చేరారు. 28లో చదువు పూర్తయింది.

పై చదువులు చదవాలన్నది రాజు కోరిక. తండ్రి ఆర్థికస్థితి సహకరిస్తుందో లేదోనన్న అనుమానం. అప్పటికే రాజుకి వివాహం కూడా అవ్వడంవల్ల ఎలా? అన్న ఆలోచనలో పడ్డారు రాజు. ఎట్టకేలకు రాజు లండన్‌ వెళ్లారు. ఎల్‌.ఆర్‌.సి.పి., ఎం.ఆర్‌.సి.ఎస్‌. డిగ్రీలు సాధించారు. అప్పట్లో క్షయ, శ్వాసకోశ వ్యాధుల వల్ల ఎంతో మంది చనిపోయేవారు. అందువల్ల రాజు లండన్‌లో ఉన్నత విద్య పూర్తయినా వియన్నా వెళ్లి అత్యున్నత విద్య సాధించాలనుకొన్నారు. వెళ్లారు. శ్వాసకోశ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి పోడూరు గ్రామం వచ్చారు. ప్రాక్టీసు మొదలు పెట్టారు.

అప్పట్లో జాతీయోద్యమ ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండేది. దానికి బాగా ఆకర్షితులయ్యారు రాజు. ఓ పర్యాయం రాజుని ఏలూరులో వైద్య సంఘ సమావేశానికి ఆహ్వానించారు. అందులో రాజు అద్భుతంగా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఓ ఆంగ్ల మిలటరీ అధికారివిని భారతీయుల్లోనూ ఇంతటి ప్రజ్ఞావంతులుంటారా అని ఆశ్చర్యపోయారు. వెంటనే రాజుని కలిసి మిలిటరీలో చేరితే మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుందన్నారు. రాజు అంగీకరించారు.

మిలిటరీలో పోస్టింగ్‌ రానే వచ్చింది. బెంగుళూరు, పూనెలో కొన్నాళ్లు పని చేశాక సౌదీ ఆరేబియాలోని ''ఎమన్‌''కి బదిలీ అయింది. ఏడెన్‌ నగరంలో ఉంటూ అబిసీనియా యుద్ధబాధితులకు సేవ చేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో రాజుకి సింగపూర్‌కి బదిలీ అయింది. ఆయన సింగపూరులో ఉండగానే రెండో ప్రపంచ యుద్ధం తూర్పు ఆసియా దేశాలకు పాకింది.

1941లో జపాన్‌, ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధ ప్రకటన చేసింది. ఆ సమయంలోనే కల్నల్‌ రాజు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ పట్ల ఆకర్షితులయ్యారు. సుభాష్‌చంద్రబోస్‌కి కుడిభుజంగా మారారు. అండమాన్‌ దీవులలోని సెల్యులర్‌ జైలును బ్రిటిషర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న సమయంలో కెప్టెన్‌ రాజు, సుభాష్‌ ఇద్దరూ ఉన్నారు. జాతీయ పతాక వందనం చేసిన వారు కూడా వీరిద్దరే. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో కీలక వ్యక్తిగా పరిణమించారు. కల్నల్‌ రాజు నేతాజీ ఆంతరంగిక వైద్యుడిగా పని చేశారు.

1944 ఫిబ్రవరి నాలుగో తేదీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఇంగ్లాండు, అమెరికాలపై యుద్ధం ప్రకటించిన రోజు నుంచీ బర్మాలో ఉన్నంతకాలం కల్నల్‌ రాజు నేతాజీ ఆంతరంగికుడిగానే ఉన్నారు. 

1944 ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ మణిపూర్‌లోని మెయిరాంగ్‌ ప్రాంతం చేరుకొని బ్రిటిషు సైన్యాన్ని ఎదిరించి పారదోలి స్వతంత్ర జెండా ఎగురవేసింది. ఆ తర్వాత ఫౌజ్‌ సైనికులు చాలామంది మరణించారు. బ్రిటన్‌ ఆధిపత్యం మొదలైంది. మంచూరియా మీదుగా రష్యా వెళ్లడానికి ప్రయత్నించిన నేతాజీ కల్నల్‌ రాజు కోసం ప్రత్యేకంగా కారు పంపారు. ఆకారు బాంబు దాడిలో గుల్ల అయింది. కల్నల్‌ రాజు మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు. అంతకు ముందు అలా ఎన్నో సార్లు జరిగింది! రాజు ప్రమాదానికి గురైన తరుణంలోనే నేతాజీ సింగపూరు నుంచి బ్యాంకాక్‌ వెళ్లిపోయారు. అందరూ రాజు హతులయ్యారని భావించే తరుణంలో ఆయన బయటికొచ్చారు.

ఆనాటికి పదిహేడువేల మంది సైనికులు మిగిలి ఉన్నారు. క్షమాభిక్ష వేడుకొంటే వారిని విడుదల చేస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షమించమని అడగడానికి వారు అంగీకరించలేదు. అయితే భారత జాతీయ కాంగ్రెస్‌ సైనికుల పక్షాన నిలిచింది. కోర్టు మార్షల్‌ విచారణ జరిపి సైనికుల్ని విడుదల చేసింది. 
కల్నల్‌ రాజు పోడూరు చేరుకొన్నారు. తిరిగి వైద్యవృత్తి చేపట్టారు. మిలిటరీలో చేరమని వైస్రాయ్‌ ఆయనను ఆహ్వానించారు. బరోడా మహారాజు తన పర్సనల్‌ డాక్టర్‌గా రమ్మన్నారు.

విజయలక్ష్మీ పండిట్‌ రష్యాకు రాయబారిగా వెళ్లినపుడు ఎంబసీలో చేరమని కోరారు. వాటన్నిటినీ తిరస్కరించిన కల్నల్‌ రాజు 1953లో ధవళేశ్వరంలో ఆరు ఎకరాల భూమిని సేకరించి ఆస్పత్రి నిర్మించారు. అప్పట్లోనే ఎక్స్‌రే తీసే యంత్రాలు కూడా తెప్పించారు. అలా ఆయన అధునాతన వసతులు కల్పించారు.
మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒరిస్సా మాజీ గవర్నరు కుమారస్వామి వంటి వారు కల్నల్‌ రాజును రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారు. 

సరోజినీనాయుడు కుమారుడు జయసూర్య వంటివారుప్రోత్సహించడంతో చివరికి కల్నల్‌ రాజు రాజకీయాల్లోకి రావడానికి సంసిద్ధమయ్యారు. అప్పటికే ఆయన జాతీయనాయకులు గాంధీజీ మొదలుకొని అందరితో మంచి పరిచయాలుండేవి. 

1957 సార్వత్రిక ఎన్నికల్లో కల్నల్‌ డి.ఎస్‌.రాజు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెహ్రూజీతో పరిచయాలుండడంతో ఆరోగ్య, రక్షణ విషయాల్లో ఆయన కల్నల్‌ సలహాలు తీసుకొనేవారు. 

1963లో జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశానికి భారత ప్రభుత్వపు ప్రతినిధిగా కల్నల్‌ని నెహ్రూజీ పంపడం విశేషం.

1962లో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రెండేళ్లు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. తర్వాత లాల్‌బహదూర్‌శాస్త్రి మంత్రివర్గంలో డిప్యూటీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆరోగ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలో, దేశంలో ఆస్పత్రుల్ని తనిఖీ చేసి సదుపాయాలు కల్పించారు.

కల్నల్‌రాజు ఎప్పుడూ దూరదృష్టితో వ్యవహరించారు. అప్పటి విశాఖ జిల్లా కోరుకొండలో సైనిక్‌స్కూల్‌ నిర్మాణానికి కృషి చేసి ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు పొంది పాఠశాల నిర్మించారు. ఆ పాఠశాల కోసం కల్నల్‌రాజు స్వయంగా నెహ్రూజీని కలిశారు. భూపతిపాలెంలో రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మించారు.

ఆయన జీవనయానంలో మరో విశిష్టత కాకినాడలో రంగరాయ మెడికల్‌ కళాశాల స్థాపన! అలాగే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ని ఒప్పించి నెలకొల్పిన ముళ్లపూడి వెంకట్రామయ్య విద్యా సంస్థ. తోటలు పెంచారు. పేదలకు వైద్య సాయం చేశారు. అందరికీ తలలో నాలుకలా మెలిగారు. 

1973 జూన్‌ 6న కల్నల్‌రాజు పరమపదించారు. ఆయన పలు వ్యవస్థల, సంస్థల నిర్మాత.భవిష్యత్తరాలు ఆయన సేవల్ని గుర్తుంచుకొంటాయి. ఆయనకి నమస్కరిస్తూనే ఉంటాయి.

Aadhunikullo Samkuchita Paridhi kanipistondi

''ఆధునికుల్లో సంకుచిత పరిధి కనిపిస్తోంది''
:ఏల్చూరి మురళీధరరావు
స్తినాపురంలో తెలుగు పలుకును కమ్మగానే కాదు, మనోజ్ఞంగా, సరళ సుందరంగా, భావ గర్భితంగా వినిపించగల ''సుమధుర వాణి'' ఆయనది. పద్యమైనా, సంస్కృత శ్లోకమైనా విన సొంపుగా పఠిస్తూ, శ్రోతలకు కలిగే అనుమానాల్ని తీరుస్తూ తెలుగు భారతిగా మన్ననలందుకొన్న రచయిత, వక్త, ఉపన్యాసకులు, అనువాదకులు, అవధాని, పండిత శిరోమణి డా. ఏల్చూరి మురళీధరరావు. 1954 అక్టోబరు 19న హైదరాబాదులో జన్మించారు. నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం ఆయన జనకులు. పాఠశాల విద్య ఢిల్లీ ఆంధ్ర స్కూల్లో కొన్నేళ్ళు మద్రాసు రామకృష్ణా మిషన్‌ పాఠశాలలో కొన్నేళ్ళు సాగింది. ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పారు ఏల్చూరి-
''మంగళరూప! నీ గుడి సమంచిత భక్తిని జేరి చెప్పులం
బ్రాంగణమందు వీడుట యపాయమటంచు దలంచువారలా
అంటూ రాసిన పద్యం పలువురి మన్ననలందుకొంది. అంతేనా?!
 
1971 నాటికే వేదం వారి మనవడు వేదం వేంకటరాయశాస్త్రి, అనిసెట్టి తదితరుల పరీక్షకు నిలిచి ''బాలకవి'' బిరుదు పొందారు. విద్యార్థి దశలోనే ప్రాచీన సాహిత్యాన్ని మధించి పలువురు స్వామీజీలపై వెలువడిన గ్రంథాలకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. పుష్కిన్‌, చెకోవ్‌ల వంటి అంతర్జాతీయ రచయితల రచనలకు అనువాదాలు చేశారు. పలు భాషలు నేర్చుకున్నారు. సంస్కృతం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, ప్రాకృతం, రష్యన్‌, ఇటాలియన్‌ భాషల్లో సృజనాత్మక రచనలు చేసే నేర్పు సాధించారు.

1982 నుంచీ వీలు కలిగినపుడల్లా అవధానాలు చేస్తున్నారు. ఇతరుల అవధానాలకు పృచ్ఛకులుగా వ్యవహరిస్తున్నారు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆరార్‌ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్‌.ఆర్‌. కళాశాలల్లో ఎం.ఎ. తెలుగు పూర్తి చేశారు. ఎం.ఫిల్‌ మద్రాసు విశ్వవిద్యాలయంలో ద్రోణపర్వం మీద పూర్తి చేశా. ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్ళు చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలల్లో ఉద్యోగంలో చేరారు.

గణపవరపు ''వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసం'' లోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి ''తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం'' అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో ఉన్న నాలుగేళ్లలో ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లిక్‌, వింజమూరి లక్ష్మి వంటి వారి కోసం లలిత గీతాలు రాశారు. ఢిల్లీ వెళ్లాక నిత్యం సభలు సమావేశాలతో బిజీగా ఉన్నా ''విష్ణు పురాణం'' మొత్తాన్ని సరళాంధ్ర వచనంలో రాశారు. సంస్కృత శ్రీమద్భాగవతాన్ని మూడు సంపుటాలుగా తెలుగులో రాశారు. ఇవన్నీ శ్రీరామకృష్ణ మఠం వారి కోసం నిర్వహించడం గమనార్హం. 'శ్రీశేషశైలేశలీల' అనే బంధ కవిత్వం రాశారు. చిత్ర కవిత్వ లక్ష సారం రాశా. నెల్లూరు, మద్రాసు- ఇలా ఎన్నోచోట్ల సత్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అలహాబాదులో నిర్వహించిన పదిహేను రోజుల సదస్సులో పాల్గొని తెలుగు సాహిత్యాన్ని ప్రచారం చేశారు. కొన్నేళ్లు 'కళాజ్యోతి' అనే పత్రిక నడిపారు.

'భక్తిమార్గం' వంటి నేషనల్‌ ఫిలిం డివిజన్‌ కార్యక్రమాలకు మాటలు, పాటలు రాశారు. సి.వి. సుబ్బారావు ఆంగ్ల కవితల గ్రంథానికి సంపాదకుడిగా ఉన్నారు. ఎన్నో రంగాల్లో ప్రజ్ఞావంతుడైన ఏల్లూరి ఢిల్లీలో తెలుగు బోధన, చదువు, తదితరాల గురించి ఆయన మాటల్లోనే విందాం.

 
* శ్రీశ్రీగారొకసారి నీకు తెలుగు బాగా రావాలంటే ఇంగ్లీషు బాగా చదవమని సలహా ఇచ్చారు. నేను హాస్యానికేమో అనుకొన్నాను. కానీ అధ్యయనం చేశాక నిజమనిపించింది. ఇంగ్లీషు భాష చదివేకొద్దీ అంత నవ్యమైన, విస్తృతమైన భావాలను తెలుగులో ఎలా వ్యక్తీకరించాలో ఆలోచన మొదలైంది.
 
* మన తెలుగు ఎం.ఎ.లో స్లెవొనిక్‌ భాషల్లో ఉన్నంత విస్తృత పరిధిలో అధ్యయనం సాగడం లేదు. మన చదువు కూపస్థ మండూకంలానే ఉంది. కనీసం ఉత్తర భారత దేశంలో సంస్కృతాధ్యయనంలో జరుగుతున్న అధ్యయనం, పరిశోధన కూడా తెలుగులో జరగడం లేదు. తెలుగులో మౌలిక పరిశోధనలు రావడం లేదు. సమకాలీనత, అనువర్తనీయత (అప్లెయిడ్‌ లిటోరీక్రిటిసిజమ్‌) అన్నవి లేనే లేవు. 1950ల తర్వాత విశ్వజనీనమైన దృక్పథాన్ని కోల్పోయాం. ఇపుడు సంస్కృతమైనా, తెలుగైనా ఒక భాషగా మాత్రమే చూస్తున్నాం. ఒక మాధ్యమంగా చూడడం లేదు. ఎం.ఎ. తెలుగు చదివే విద్యార్థులకు దాని ద్వారా ప్రపంచాన్ని దర్శించే కౌశలం అలవడాలి. పరీక్షల దృష్టితో భాషాధ్యయనాన్ని ఒక ఉపకరణంగా మార్చేశారు తప్ప సాహిత్యాధ్యయనం ద్వారా ఆదర్శాల కల్పన, విశ్వమానవుడిని రూపొందించే ప్రయత్నం జరగడం లేదు. ఒక సంకుచిత పరిధి ఉంది.
 
* ఈ చదువుల వల్ల విద్వాంసులు రావడం లేదు. స్పెషలిస్టులొస్తున్నారు. ప్రాచీనతకు, ఆధునికతకు ఉన్న లంకెను ఇప్పుడు తొలగించారు. వేదం వెంకటరాయశాస్త్రి తెలుగు ఆధునికత పేరుతో తన కాలంలో జరిగిన మార్పుల్ని గుర్తించి ''భాషకు మీరు విషం పెట్టినారు' అని ఆనాడే అన్నారు. అది నిజం అని ఈనాడు రుజువవుతోంది. ఆయన అనువాదాలు ఎలా చేయాలో, నాటక వ్యాఖ్యానాలు ఎలా చేయాలో నేర్పారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు చేసిన ''ప్రసన్న రాఘవ ఆంధ్రీకరణ''ని విమర్శిస్తూ అది సహస్రాధిక దోషజుష్టము అన్నారు. అందుకే కట్టమంచి రామలింగారెడ్డి గారు శృంగార నైషధ సంజీవనీ వ్యాఖ్య వెలువడినపుడు ''భాషా సాహిత్యాల్లో గొప్ప కృషి చేసిన చివరి పండితుడు వేదం'' అన్నారు.
 
* ఆధునికుల్లో శ్రీశ్రీ, శిష్‌ట్లా, ఆరుద్ర, బైంగి, ఏల్చూరి, దేవులపల్లి వంటి వారి వరకు కూడా కళా విమర్శ పరిచయం ఉండేది. అందువల్లే వారు తెలుగులో కొత్త మార్గాలు సృష్టించారు. ప్రపంచ సాహితీ మార్గాల్ని తెలుగులోకి తెచ్చారు. ఇప్పటివారికి ఆధునిక సాహిత్యంలో సంకుచిత పరిధి కనిపిస్తోంది. కళావిమర్శ లేదు. ప్రపంచ దృక్పథం లేదు. ఇంగ్లీషులో వచ్చిందే ప్రామాణికమని భావిస్తున్నారు. దాన్నే అంధానుకరణం చేస్తున్నారు. బ్రాడ్‌గేజ్‌ రైలు పట్టాలమీద మీటర్‌ గేజ్‌, పెట్టెనెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
 
* సాహిత్యం రాజకీయాలు ఎప్పుడూ అనూచానంగా కలిసే ఉండేవి. ఆధునికుల్లో కేవల రాజకీయాలు రాజకీయ ప్రయోజనంతో సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
 
* ఫ్రెంచి ఫెమినిజమ్‌లో ప్రస్తుతం నాలుగు దశలున్నాయి. అది మూడో దశలో ఉండగా మన తెలుగులో స్త్రీ వాదులు రంగ ప్రవేశం చేశారు. అందువల్ల స్త్రీవాద చరిత్రను ఉపేక్షించి స్త్రీవాదాన్ని మాత్రమే ప్రచారం చేశారు. ఒక్క ఓల్గా మాత్రమే చారిత్రక సమన్వయంతో రాస్తూ వచ్చారు. తక్కినవాళ్లకి అంత విస్తృత అధ్యయనం లేకపోవడం వల్ల స్త్రీవాద రచనలు చేశారు కానీ స్త్రీవాద సిద్ధాంత కర్తలు కాలేకపోయారు.
 
* ఒక యుగాన్ని క్షీణయుగం అనే భావన మన సాహితీ వేత్తలకు లేదు. నిరంతర గతి శీలమైన సాహిత్యంలో క్షీణయుగమనే భావనకు అవకాశమే ఉండదు. కందుకూరి వీరేశలింగం విక్టోరియన్‌ యుగం ప్రభావంతో సాహిత్యంలో శృంగారం అనేది అశ్లీలమనీ, రాచరిక వ్యవస్థకు ఉపకరణంగా పనికొచ్చిన స్వార్థపరుల వ్యాసంగమనీ అపార్థాల్ని ప్రవేశపెట్టారు. కందుకూరి ప్రభావంవల్లే అంధయుగం అన్న ఆలోచన మన సాహితీవేత్తలకు కలిగింది.
 
* ఢిల్లీలో ఏ కళాశాలలో చదివే వారైనా తెలుగు సబ్జెక్ట్‌ తీసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర కళాశాలలో తెలుగు చదివే అవకాశముంది. బి.ఎ., బి.కామ్‌. విద్యార్థులకు మూడు సంవత్సరాలు, బి-ఎస్సీ విద్యార్థులకు రెండు సంవత్సరాలు తెలుగు సబ్జెక్టు ఉంటుంది. ఢిల్లీలో తెలుగు ఒకే ఒక కళాశాలలో చదివే వీలుంది. పాతిక మంది విద్యార్థులున్నారు. తమిళం చదివేందుకు రెండు కళాశాలలున్నాయి. శ్రీ వెంకటేశ్వరతో పాటు మిరండా హవుస్‌ కళాశాల, తమిళానికి ముప్పై నుంచి ముప్పై అయిదు మంది విద్యార్థులున్నారు. మరే దక్షిణాది భాష చదివేందుకు అక్కడ వీల్లేదు. అయితే పి.జి.లో తెలుగు ఎం.ఎ. లేదు.. కానీ ఎం.ఫిల్‌., పి.హెచ్‌.డి వంటివి తెలుగులో చెయ్యవచ్చు. తమిళంలో ఎం.ఎ. చెయ్యవచ్చు. ఎం.ఫిల్‌, పి.హెచ్‌.డి. చెయ్యవచ్చు.
 
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పి.జి.లో తెలుగు బోధన కోసం కృషి చేస్తే ఆ అవకాశం కూడా ఢిల్లీ ఆంధ్రులకు కలగవచ్చు. ప్రభుత్వం సంకల్పిస్తే అదేమంత కష్టం కాదు. అమెరికాలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో రవీంద్రనాథ్‌ టాగూర్‌ (బెంగాలీ), సుబ్రహ్మణ భారతి (తమిళం) పేరిట పీఠాలున్నాయి. అమెరికాలో ఇప్పుడు ఇతర భాషలవారికన్నా ఎక్కువ మంది తెలుగువారున్నారు. విశ్వనాథ వంటి మహా కవుల పేరుతో పీఠాల స్థాపన కోసం కృషి చేయవచ్చు.
 

20va Sataabdapu Mahaakavi Nerodaa

తెలుగు కవుల మార్గదర్శి
20వ శతాబ్దపు మహాకవి నెరూడా
- చీకోలు సుందరయ్య
వాల్మీకి, కాళిదాసు, భారవి వంటి పూర్వుల ప్రభావంతో రచనలు చేసిన కాలం చెల్లిపోయి, తదనంతర కాలాల్లో ముందుతరం కవుల ప్రభావంతో రచనలు చేసే కాలం ఆవిర్భవించింది. ఆంగ్ల ప్రకృతి కవులు... కాల్పనిక కవులు మన భావకవుల్ని ఎంతగా ప్రభావితం చేశారో రష్యన్‌, ఫ్రెంచి... తదితర భాషా రచనయితలు అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపారు.
''నా కవిత్వం గురించి నన్నడగకండి
కర్షకుణ్ణడగండి, కార్మికుణ్ణడగండి
అతని నుండొచ్చిందే నా కవిత్వం
అతడే నాకు మహాకవి...''
ఆధునికుల రచనలతో పరిచయమైన వారికి ఈ పంక్తులు ''పాబ్లోనెరూడా''వి అని తెలుస్తుంది! ఈ స్పానిష్‌ కవిని ప్రతి ఆధునిక తెలుగుకవి తన సొంతం చేసుకోవడం గమనార్హం. వచన కవిత్వం రాస్తోన్నవారిలో రైట్‌, లెఫ్ట్‌ అనే తేడాలేకుండా అందర్నీ ప్రభావితం చేసిన కవి పాబ్లోనెరూడూ...
కె.శివారెడ్డి, వరవరరావు, అద్దేపల్లి రామ్మోహనరావులే కాదు సి.వి.కృష్ణారావు, సుమనశ్రీ ఆశారాజు, ఎండ్లూరి సుధాకర్‌, వెలిచాల కొండలరావు వాడ్రేవు చినవీరభద్రుడు, సిద్ధార్థ... ఇలా ఎవరి ప్రసంగం విన్నా పాబ్లో నెరూడా పేరు వినిపిస్తుంది.

ఎక్కడో ఓ సందర్భంలో ఆయన ప్రస్తావన రాకుండా సాహిత్యం గురించి చర్చ సమాప్తం కాదు. కొండలరావు మాటల్లో చెప్పాలంటే -
''ఆలోచనల్లో, అభివ్యక్తిలో సరికొత్త పుంతలు తొక్కిన కవి
భావాన్నీ భాషనీ రెంటినీ అదనంగా ఆలోచనాత్మకంగా పుట్టించిన కవి
అర్థాలకు సరికొత్త అర్థాలు కనుగొన్న కవి
ఆర్ద్రతను మరింత ఆర్ద్రతతో
సౌందర్యాన్ని మరింత సౌందర్యంతో అందించన కవి...''
దేశాల తేడాలు లేకుండా అన్ని దేశాల్లోను, అందరు ముక్తకంఠంతో ఇరవయ్యో శతాబ్దపు మహాకవిగా కీర్తించిన కవి పాబ్లోనెరూడా. ఇటీవలే ఆయన శతజయంతి వేడుకలు ముగిశాయి. ఆయన తల్లిదండ్రులు కార్మికులు. తండ్రి రైల్వే వర్కర్‌ అయితే తల్లి ప్రాథమిక స్కూలు టీచర్‌. దక్షిణ చిలీలో బాగా వెనుకబడిన ప్రాంతంలో జన్మించిన నెరూడా చిన్నతనం నుంచీ కవిత్వాన్నే తన ఉనికిగా, జెండాగా, ఎజెండాగా మార్చుకొన్నారు.

ఆయన ఇరవయ్యేళ్ల వయసులో ఉన్నపుడు ''ట్వంటీ పొయెమ్స్‌ ఆఫ్‌ లవ్‌ అండ్‌ ఎ సాంగ్‌ ఆఫ్‌ డిస్పెయిర్‌...'' ప్రచురించారు. ఆ కవితలు పెద్ద, చిన్నతేడా లేకుండా అందర్నీ ఆకట్టుకొన్నా, ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందరూ ఆ కవితలు తమ హృదయ స్పందనలుగా గుర్తించారు. ''కాంటో జనరల్‌, హెయిట్స్‌ ఆఫ్‌ మచ్చు, పిచ్చు'' వంటివి ఆయన తమకోసమే రాశారని దక్షిణ అమెరికా మొదలుకొని అందరూ వాటితో మమేకం చెందారు. 

నెరూడా పసిఫిక్‌ మహాసముద్రాన్ని ఎంత గాఢంగా ప్రేమించారో, జీవితంలో అత్యంత సాధారణమైన వస్తువుల్ని సైతం అంతే గాఢంగా ప్రేమించారు. 'ఇస్లానెగ్నా' అనే తన ఇంటిని ఆయన పసిఫిక్‌ మహాసముద్రానికి ఎదురుగానే నిర్మించుకోవడం విశేషం. ఆయన విమర్శకులు పేర్కొన్నట్లు ఆయన సిరాతో రాయలేదు... రక్తంతోనే రాశారు...! అంతే ప్రేమతో రాశారు. పీపుల్‌ అనే ఒక కవిత అందుకు నిదర్శనంగా ఇలా సాగుతుంది -
''అతడు నాకు బాగా గుర్తు
ఎప్పుడో కొన్ని వేలవేల ఏళ్ల క్రితం చూశానతణ్ని మొదటిసారి
అతడు గుర్రాలెక్కలేదు, బళ్లూ ఎక్కలేదు
పల్లకీలో ఊరేగలేదు
అనంత దూరాలన్నీ మొద్దుబారి చీలిన
తన నగ్న పాదాలపైనే గమించాడు
అతని చేతుల్లో కత్తులూ, కటార్లూ ఎప్పుడూ చూళ్లేదు నేను
భుజంపై సుత్తీ, కొడవలి, గొడ్డలి, పార, నాగలి
అతని అస్తిత్వంలో ఓ భాగం
తనవాళ్లతో ఎప్పుడూ పోట్లాడలేదతను
అతని పోరాటం అంతా నేల, సీళ్లూ, ప్రకృతి
క్రూర కర్కోటకాలతో
ఆకాశన్నంటే చెట్లను కూల్చి ఇళ్లను దూలాల్నీ
కిటికీల్నీ అమరుస్తాడు
మట్టితో గోడల్ని, గోడలకు తలుపులు తెరుస్తాడు
సుళ్లు తిరిగే సముద్రంలోకి
రత్నరాశులు తెస్తాడు
మానవ కోటికి ప్రాణదానం చేస్తాడు
ఇలా సాగే పాబ్లోనెరూడా కవితలకు అన్నిదేశాల్లో పాఠకులున్నారు. ఒక అంచనా ప్రకారం ఇరవయ్యో శతాబ్దంలోని ఆయన సమకాలికుల్లో అత్యధిక సంఖ్యలో పాఠకులు ఎవరి కవిత్వమైనా చదివి ఉంటే అది ఆయన కవిత్వాన్నే... నెరూడా కర్షక, కార్మిక సంక్షేమం ఎలా కోరారో అంతర్జాతీయంగా జాతుల సమైక్యతను అంతగానే కోరారు. చిలీలో స్పానిష్‌ అంతర్యుద్ధాలు సమసిపోవాలని కోరారు. చిలీలోని ఈతరం కవులు ఇసబెల్‌ అలెండె, ఆంటోనియోస్కర్మెట, జార్జ్‌ ఎడ్వర్డ్స్‌ వంటివారికి ఆదర్శంగా నిలిచారు.

నెరూడాది పసిపిల్లల మనస్తత్వం. ఆయన సముద్రం సమీపంలోని ఆలుచిప్పలు, నదుల్లోని గుండ్రటిరాళ్లు, ఆఫ్రికాలో లభ్యమయ్యే మాస్క్‌లు ఇలా అన్నీ సేకరించారు. ఆయన గృహంలో ఇప్పటికీ అవి ప్రదర్శితమయ్యాయి.

విమర్శకులు ఆయన ''రెసిడెన్స్‌ ఆన్‌ ఎర్త్‌''ని మాగ్నమ్‌ ఓపస్‌గా పరిగణిస్తారు. ఆయన ప్రపంచంలోని వివిధ దేశాలు పర్యటించారు. బర్మా, శ్రీలంక, ఒటావియా, జావా, సింగపూర్‌లు సందర్శించి 1928 ప్రాంతాల్లో కలకత్తా వచ్చారు. ఆ సంవత్సరం కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సదస్సులో పాల్గొని గాంధీజీ, నెహ్రూజీ వంటి నాయకుల్ని కలిశారు. ఆయన మద్రాసు నగరం సందర్శించినపుడు మన దేశ స్త్రీలు చీరలు ధరించిన వైనానికి ముగ్ధులయ్యారు. ఆ తర్వాత ఆయన 1957లో మళ్లీ భారత్‌ పర్యటించారు.

తన అనుభవాలతో ఆయన ''ఇండియా'' అనే దీర్ఘకవిత రాశారు. భారతదేశంలో తొలిసారిగా బెంగాలీలు ఆయన రచనల వల్ల ప్రభావితులయ్యారు. ఆ తర్వాత అన్నిభాషలవారూ అయ్యారు. ఇలాన్‌ స్టావెన్స్‌, పాబ్లో నెరూడా కవిత్వాన్ని ''ద పొయెట్రీ ఆఫ్‌ పాబ్లో నెరూడా'' పేరుతో వెయ్యి పుటల గ్రంథం ముద్రించారు.

2003లో ప్రచురితమైన ఈ పుస్తకంలో దాదాపు ఆరు వందల కవితలున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చంద్రబాలి సింగ్‌ సంకలించిన ''కవితా సంచయన్‌'' పాబ్లో నెరూడా కవితల్ని హిందీ పాఠకులకు పరిచయం చేస్తోంది. మలయాళంలో సచ్చిదానందన్‌ (అకాడెమీ కార్యదర్శి) ఎన్నో కవితలు అనువదించి ప్రచురించారు. 

తెలుగులో ఇప్పటి వారిలో కె.శివారెడ్డి, చంద్రమౌళి, దేవరాజు మహారాజు, త్రిపురనేని శ్రీనివాస్‌, నగ్నముని, నిర్మలానంద, వెలిచాల కొండలరావు వంటివారు ఎన్నో కవితలు అనువదించారు. తెలుగు కవులు ఎక్కువగా చదివేది, స్ఫూర్తి పొందేది నెరూడా కవితల నుంచే అంటే అతిశయోక్తి కాదు. ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించిన కవి నిస్సందేహంగా నెరూడా మాత్రమే!